Friday, June 18, 2010

శ్రీ శ్రీ, - మహాకవి శ్రీ శ్రీ శత జయంతి 1910 - 2010


మహాకవి శ్రీశ్రీ
శ్రీశ్రీ ఇరవయ్యవ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి శ్రీశ్రీ. శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీగా ప్రసిద్ధుడయ్యాడు. విప్లవ కవిగా, సాంప్రదాయ, ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించినవాడిగా, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, విప్లవ రచయితల సంఘం స్థాపక అధ్యక్షుడిగా, సినిమా పాటల రచయితగా ఆయన ప్రసిద్ధుడు.

శ్రీశ్రీ హేతువాది మరియు నాస్తికుడు. మహాకవిగా శ్రీశ్రీ విస్తృతామోదం పొందాడు. ఆయన సృజించిన కవితా! ఓ కవితా! అనే కవిత గురించి శ్రీశ్రీ .జీవిత కథకుడు, ప్రసిద్ధ రచయిత, భాషావేత్త, బూదరాజు రాధాకృష్ణ ఇలా రాసాడు కనీసం వేయి సంవత్సరాల చరిత్ర ఉన్న తెలుగు సాహిత్యంలో కవితను ఇలా నిర్వచించి, ఇంత కవితాత్మకంగా వర్ణించి, ఇంత అద్భుత సృష్టి చేసిన మరో కవి లేనే లేడు.

ఇదే అతణ్ణి సాహితీ శిఖరాగ్రాన నిలిపింది. మహాప్రస్థానం ఆయన రచించిన కావ్యాల్లో ప్రసిద్ధమైనది.


జీవిత గమనం

శ్రీశ్రీ - శ్రీరంగం శ్రీనివాస రావు - 1910 జనవరి 2 న పూడిపెద్ది వెంకటరమణయ్య, అప్పలకొండ దంపతులకు జన్మించాడు. ( శ్రీశ్రీ తన అనంతం పుస్తకంలో పుట్టిన రోజు గురించి వివరణ ఇచ్చారు. తను ఏప్రిల్లో పుట్టానని, తండ్రి పాఠశాలలో అవసరం నిమిత్తం 2-1-1910 అని రాయించారని పేర్కొన్నారు)

శ్రీరంగం సూర్యనారాయణకు దత్తుడగుట వలన ఈయన ఇంటిపేరు శ్రీరంగంగా మారింది. ప్రాధమిక విద్యాభ్యాసం విశాఖపట్నం లో చేసాడు. 1925 లో SSLC పాసయ్యాడు. అదే సంవత్సరం వెంకట రమణమ్మతో పెళ్ళి జరిగింది. 1931 లో మద్రాసు విశ్వ విద్యాలయం లో బియ్యే (జంతుశాస్త్రము) పూర్తి చేసాడు.


1935లో విశాఖలోని మిసెస్‌ ఎ వి ఎస్‌ కాలేజీలో డిమాన్‌స్ట్రేటర్‌గా చేరాడు. 1938లో మద్రాసు ఆంధ్రప్రభలో సబ్‌ ఎడిటరుగా చేరాడు. ఆ తరువాత ఆకాశవాణి, ఢిల్లీ లోను, మిలిటరీ లోను, నిజాము నవాబు వద్ద, ఆంధ్ర వాణి పత్రికలోను వివిధ ఉద్యోగాలు చేసాడు. 1933 నుండి 1940 వరకు ఆయన రాసిన మహాప్రస్థానం, జగన్నాథుని రథచక్రాలు, గర్జించు రష్యా వంటి గొప్ప కవితలను సంకలనం చేసి మహప్రస్థానం అనే పుస్తకంగా ప్రచురించాడు. తెలుగు సాహిత్యపు దశనూ, దిశనూ మార్చిన పుస్తకం అది.

 1947 లో మద్రాసుకు తిరిగి వచ్చి అక్కడే స్థిరపడ్డాడు. తన రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తూ మరిన్ని గొప్ప రచనలు చేసారు. ఎన్నో సినిమాలకు పాటలు, మాటలు రాసాడు. పిల్లలు లేని కారణం చేత 1949 లో ఒక బాలికను దత్తత తీసుకున్నాడు. 1956 లో సరోజను రెండవ వివాహం చేసుకున్నాడు. రెండవ భార్య ద్వారా ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు కలిగారు.
 
1955 సార్వత్రిక ఎన్నికలలో కమ్యూనిస్టుల తరఫున శ్రీశ్రీ చురుగ్గా ప్రచారం నిర్వహించాడు. హనుమాన్‌ జంక్షన్లో ఒక ప్రచార సభలో ఆయన అరోగ్యం దెబ్బతిని కొన్ని నెలల పాటు ఆసుపత్రిలో ఉండవలసి వచ్చింది. 1969 లో ప్రత్యేక తెలంగాణా ఉద్యమం తీవ్రంగా ఉన్న సమయంలో శ్రీశ్రీ వావిలాల గోపాలకృష్ణయ్యతో కలిసి ఖమ్మంలో సమైక్య వాదాన్ని వినిపిస్తూ ప్రదర్శన జరిపాడు. ఉద్యమకారులు ప్రదర్శనకు భంగం కలిగించడానికి ప్రయత్నించినా ఆగక తమ ప్రదర్శనను కొనసాగించాడు.
 

వివిధ దేశాల్లో ఎన్నోమార్లు పర్యటించారు. ఎన్నో పురస్కారాలు పొందాడు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, మొదటి రాజా లక్ష్మీ ఫౌండేషను అవార్డు వీటిలో కొన్ని. అభ్యుదయ రచయితల సంఘానికి (అరసం) అధ్యక్షుడిగా పని చేసాడు. 1970 లో ఆయన షష్ఠి పూర్తి ఉత్సవం విశాఖపట్నం లో జరిగింది. ఆ సందర్భంగానే ఆయన అధ్యక్షుడుగా విప్లవ రచయితల సంఘం (విరసం) ఏర్పడింది.
కొంతకాలం క్యాన్సరు వ్యాధి బాధకు లోనై 1983 జూన్ 15 న శ్రీశ్రీ మరణించాడు.
విశాఖపట్నం లోని బీచ్ రోడ్డులో ఆయన నిలువెత్తు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.

ఈ శతాబ్ది నాది : శ్రీశ్రీ


ఇరవయ్యవ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి శ్రీశ్రీ. శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీగా ప్రసిద్ధుడయ్యాడు. విప్లవ కవిగా, సాంప్రదాయ, ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించినవాడిగా, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, విప్లవ రచయితల సంఘం స్థాపక అధ్యక్షుడిగా, సినిమా పాటల రచయితగా ఆయన ప్రసిద్ధుడు.

శ్రీశ్రీ హేతువాది మరియు నాస్తికుడు. మహాకవిగా శ్రీశ్రీ విస్తృతామోదం పొందాడు. ఆయన సృజించిన కవితా! ఓ కవితా! అనే కవిత గురించి శ్రీశ్రీ .జీవిత కథకుడు, ప్రసిద్ధ రచయిత, భాషావేత్త, బూదరాజు రాధాకృష్ణ ఇలా రాసాడు కనీసం వేయి సంవత్సరాల చరిత్ర ఉన్న తెలుగు సాహిత్యంలో కవితను ఇలా నిర్వచించి, ఇంత కవితాత్మకంగా వర్ణించి, ఇంత అద్భుత సృష్టి చేసిన మరో కవి లేనే లేడు. ఇదే అతణ్ణి సాహితీ శిఖరాగ్రాన నిలిపింది. మహాప్రస్థానం ఆయన రచించిన కావ్యాల్లో ప్రసిద్ధమైనది.

శ్రీశ్రీ చాలా చిన్న వయసులోనే తన రచనా వ్యాసంగాన్ని మొదలు పెట్టాడు. తన 18 వ ఏట 1928 లో ప్రభవ అనే కావ్య సంపుటిని ప్రచురించాడు. ఈ రచనను సాంప్రదాయ పధ్ధతిలోనే రాసాడు. తరువాతి కాలంలో సాంప్రదాయికమైన గ్రాంధిక శైలి, ఛందస్సు వంటి వాటిని పక్కన పెట్టి వాడుక భాషలో మాత్రా ఛందస్సులో కవిత్వం రాయడం - ఇది గురజాడ అడుగుజాడ అని ఆయన అన్నారు - మొదలు పెట్టి గొప్ప కావ్యాలను రచించాడు.

1950లో మహాప్రస్థానం కావ్యం మొదటిసారిగా ప్రచురితమైంది. మహాప్రస్థానం, జగన్నాథుని రథచక్రాలు, బాటసారి, భిక్షువర్షీయసి మొదలైన కవితల సంపుటి అది. ఆధునిక తెలుగు సాహిత్యంలో ఈ కావ్యం అత్యున్నత స్థానంలో నిలిచి శ్రీశ్రీ ని మహాకవిని చేసింది. తరువాత మరోప్రస్థానం, ఖడ్గ సృష్టి అనే కవితా సంకలనాలను, చరమరాత్రి అనే కథల సంపుటిని, రేడియో నాటికలు రచించాడు.

మహాప్రస్థానం వంటి గీతాలన్నీ మార్క్సిజం దృక్పథంతో రాసినవే అయినా అవి రాసేనాటికి మార్క్సిజం అనేది ఒకటుందని ఆయనకు తెలియదు. 1981 లో లండన్‌‌లో ప్రచురితమైన మహాప్రస్థానం (శ్రీశ్రీ స్వదస్తూరితో దీనిని ముద్రించారు, దానితో పాటు శ్రీశ్రీ పాడిన ఈ కావ్య గీతాల క్యాసెట్టును కూడా వెలువరించారు) కు ముందుమాటలో ఆయన ఈ విషయం స్వయంగా రాసాడు. అందులో ఇలా రాసాడు.

..ఈ వాస్తవాలన్నింటికీ నేను స్పందించినా, ఇలాంటి రచనలను 'సామాజిక వాస్తవికత ' అంటారనీ, దీని వెనుక దన్నుగా మార్క్సిజం అనే దార్శనికత ఒకటి ఉందనీ అప్పటికి నాకు తెలియదు. ఇప్పుడొక్కసారి వెనక్కు తిరిగి చూసుకుంటే, మహాప్రస్థాన గీతాలలోని మార్క్సిస్టు స్ఫూర్తీ, సామాజిక స్పృహా యాదృఛ్ఛికాలు కావని స్పష్టంగా తెలుస్తోంది.

తెలుగు వారిని ఉర్రూతలూగించిన ఎన్నో గొప్ప సినిమా పాటలను ఆయన రచించాడు. అల్లూరి సీతారామరాజు సినిమాకు ఆయన రాసిన తెలుగు వీర లేవరా.. అనేది శ్రీశ్రీ రాసిన ఆణిముత్యాల్లో ఒకటి. రెండవ భార్య సరోజతో కలిసి సినిమాలకు మాటలు రాసాడు.

ప్రాసకూ, శ్లేషకు శ్రీశ్రీ పెట్టింది పేరు. అల్పాక్షరాల్లో అనల్పార్ధాన్ని సృష్టించడంలో శ్రీశ్రీ మేటి. వ్యక్తికి బహువచనం శక్తి అనేది ఆయన సృజించిన మహత్తర వాక్యమే! శబ్ద ప్రయోగంలో నవ్యతను చూపించాడు. ప్రగతి వారపత్రికలో ప్రశ్నలు, జవాబులు (ప్రజ) అనే శీర్షికను నిర్వహించాడు. పాఠకుల ప్రశ్నలకు సమాధానాలిచ్చే శీర్షిక అది. చతురోక్తులతో, శ్లేషలతో కూడిన ఆ శీర్షిక బహుళ ప్రాచుర్యం పొందింది.

శ్రీశ్రీ కవిత్వం మహోన్నత మానవత్వపూరితమైనది. మా తరం వాళ్ళమందరం ఆయన మరో ప్రపంచపు కాంతి ధగ ధగలకి ఆకర్షితులమై ఆ బాటలో ప్రయాణం చేసినవాళ్ళమే. ఆయన అందించిన ఉత్తేజం ఎప్పటికీ అలా వెలుగుతూనే ఉంటుంది. శ్రీశ్రీ తెరిచిన నూతన గవాక్షాలు కార్మికులు, కర్షకులు- సకల శ్రమజీవులకీ ఆహ్వానం పలుకుతూనే ఉంటాయి.

ఇవాళ మన కర్తవ్యం శ్రీశ్రీ కవిత్వాన్ని మెచ్చుకోవడం, ఆయన్ని పొగడ్తలతో ముంచెత్తడం మాత్రమే కాదు, ఆయన వేసిన బాట మీద సాగి ఆ మహా ప్రస్థానంలో నూతన లోకాలను ఆవిష్కరింపచేసుకోవడం.

వోల్టేర్‌ గురించి చెప్పడం అంటే మొత్తం 18వ శతాబ్దాన్ని గురించి చెప్పడం అన్నాడు విక్టర్‌ హ్యూగో. అలాగే శ్రీశ్రీ గురించి చెప్పడం అంటే 20వ శతాబ్ది తెలుగు కవిత్వం మొత్తం గురించి చెప్పడమే. గురజాడతో పడిన అడుగు జాడ ఇరవై, ముప్ఫై ఏళ్ళ విరామం తర్వాత విస్పష్టమైన శ్రీశ్రీ వారసత్వంతో ముందుకు వచ్చింది.

ఆధునిక భావజాలం, అభ్యుదయ పథం ఈ శతాబ్ది కవిత్వంలో పటిష్ఠంగా పాదుకోవడానికి శ్రీశ్రీయే మూలవిరాట్టు. ఆయన దేశ చరిత్రలు అనే గేయం మార్క్సిస్టు చారిత్రక విశ్లేషణకి కవితా రూపం. చరిత్ర నిర్మాతలు ఎవరో అది చాటింది.

శ్రీశ్రీ ఆధునిక కవిత్వానికి అందించిన మహత్తర కానుక లాలిత్యభరిత సౌకుమార్య పదబంధాన్ని పెకలించడం. శ్రీశ్రీ తన కవిత్వ విప్లవ అలంకారికతతో ఆ నీడలు కూడా కవిత్వం మీద పడకుండా తరిమేశాడు. సామ్యవాద మానవుడే శాస్త సకల విశ్వానికి అని ప్రగాఢంగా నమ్మాడు. ఆ నమ్మకాన్ని నిజం చేయడమే నేటి తరం కర్తవ్యం.

అందుకో అందుకో! అమరుడ జోహార్లు అందుకో..!
శ్రీశ్రీ జోహార్లు అందుకో..!


తేదీ: 15th Jun, 2009రచయిత: చందమామ

Wednesday, June 16, 2010

శ్రీశ్రీతో ఎన్ని అనుభవాలో.. ఎన్ని జ్ఞాపకాలో..!

'నేను అతన్ని కూడా బాగా ఎరుగుదును. నా అభిప్రాయం ఏమిటంటే-' అని శ్రీశ్రీ గురించి రాయబోతే చలం హెచ్చరిక వెక్కిరిస్తుంది. అయినా శ్రీశ్రీతో పరిచయం అయి, ఆయన కూడా పదిమందిలో కలిసినప్పుడో, ఉత్తరాల్లోనో పలకరించేంత పరిచయం పెరిగినాక, కలిసి పనిచేసే అవకాశం వచ్చినాక ఆయన గురించి అభిప్రాయం లేదా జ్ఞాపకాలు చెప్పకుండా ఉండడం అసాధ్యమనుకుంటాను.

పైగా ఆయన తన కవిత్వం అనే వ్యసనం ద్వారానే కాదు, అన్ని వ్యసనాల ద్వారా పబ్లిక్‌గా నిలబడ్డాడు. ఇవ్వాళ అరిగిపోయేలా వాడుతున్న మాట వాడాలంటే పారదర్శకంగా జీవించే పోయాడు. నవయువకులు కూడ తమ వ్యసనాల గురించి కవిత్వంలో, రచనల్లో ఇన్‌హిబిషన్స్ లేకుండా రాసుకునేంత సాహిత్య సంప్రదాయాన్ని నెలకొల్పి పోయాడు. అట్లని శ్రీశ్రీ చలం వలె, కాళోజీ వలె ధైర్యశాలి అని చెప్పడానికి రాయడం లేదు. తన బలహీనతలు కూడా దాచుకోలేని సామాన్యుడు అనిపిస్తుంది.

శ్రీశ్రీని మొదటిసారి నేను బి.ఎ. రెండవ సంవత్సరం (1958- 59)లో ఉండగా చూశాను. ఏదో సాహిత్య సభ కోసం హైదరాబాదు వచ్చాడు. వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజికి తీసుకువస్తాననే ధీమాతో హైదరాబాదుకు వచ్చాను. శ్రీశ్రీ, కాళోజీలను అభిమానించే చాలమంది, వాళ్లమీద తమకేదో హక్కు ఉన్నదని అనుకుంటారనుకుంటాను.

బుద్ధి తెలిసినప్పటి నుంచి వీరాభిమానిని, బిఎ మొదటి సంవత్సరంలోనే చేకూరి రామారావు అంతటివానితో 'తెలుగు స్వతంత్ర'లో శ్రీశ్రీ పక్షాన ఢీకొన్నాను. (ఇద్దరమూ వీరాభిమానులుగానే తలపడి పరిచయమయి మంచి స్నేహితులమయ్యాం.) నేను పిలిస్తే రాడా అన్నట్లు వచ్చాను (రాడు చూడు అని మా హితవరి జి.వి.సుబ్రహ్మణ్యం హెచ్చరించినప్పటికీ). ఆయన రానన్నాడు గానీ హైదరాబాద్‌లో సభకు ఆయన బయల్దేరే దాకా ఆయనను వింటూ, చూస్తూ, మధ్యమధ్యలో మా కాలేజికి రమ్మనే నా ఆహ్వానాన్ని ప్రాధేయపూర్వకంగా రెన్యూ చేస్తూ ఆయనతో మొదటిసారి గడిపాను. ఏభై ఏళ్లు అయింది.

ఆయన విషయంలో నాకు ఆశ్చర్యమూ, ఆనందమూ కలిగించిన ఫస్ట్ ఇంప్రెషన్ ఏమిటంటే ఆయన కూడా నా వల్లెనే తెల్లటి పైజామా, షర్టు వేసుకున్నాడు. మా ఎరుకలో శ్రీశ్రీని మొదటిసారిగా వరంగల్ కాలేజికి పింగళి రంగారావు తెలుగు సాహిత్య సమితి కార్యదర్శిగా 1962-65 మధ్యకాలంలో పిలిచాడు. అప్పుడాయన కాళోజీ ఇంట్లో దిగినప్పుడు ఉదయమే కలవడానికి వెళ్లాను. శ్రీశ్రీ, కాళోజీ ఇద్దరు బనీన్ల మీదనే ఉన్నారు. జనసేన ఆ ఇద్దరితో కలిసి నా ఫోటో తీసాడు.

ఫజిల్స్ నింపేప్పుడు, పుస్తకాలు చదివేప్పుడు తప్ప కుదురుగా కూర్చునేవాడు కాదు. గనుక తానున్న గదిలో పచార్లు చేస్తూ, ఆయన సిగిరెటు తాగే (స్టైల్ ఇప్పుడు ఆయన తెలిసిన అందరికీ తెలుసు గదా) క్రమంలో చిటికె వేస్తూ గదిలో కూర్చున్న వారితో మాట్లాడుతూ ఉంటాడు గదా. కనుక ఎవరు వచ్చినా ఎదురొచ్చి ఆప్యాయంగా ఆహ్వానించినట్లే ఉండేది.

కొందరు నిరాడంబరత్వం నిర్వహిస్తారు. కొందరికది సహజ స్వభావంగా ఉంటుంది. ఆహార్యం విషయంలో శ్రీశ్రీని చెప్పే మరెవరినయినా చెప్పాలి. ఎప్పుడయినా ప్రత్యేక సందర్భాల్లో ప్యాంటులోకి షర్ట్ టకప్ చేసి బెల్టు పెట్టుకునేవాడు. ఎం.వి.నారాయణరావు కిన్నెర సన్మానానికి వచ్చినపుడయితే సరోజగారు సిల్కు దుస్తులు వేసి తన పక్కన రైల్లో ఒద్దికగా కూచోబెట్టుకోవడం కాజీపేట రైల్వేస్టేషన్లో కలిసినప్పుడు చూసాం. కాని సాయంకాలం వరకల్లా పసిపిల్లలవలె ఆయనకా దుస్తులపై శ్రద్ధ ఉండదు.

ఆయన ఇంట్లో ఎక్కువగా తువ్వాల కట్టుకుని ఉండేవాడేమో గాని దిగంబర కవుల రెండు సంపుటాలు వెలువడిన తర్వాత 66లో ఆయనను మద్రాసులో కలిసినపుడు ఆ అవతారంలోనే ఉన్నాడు. ఎంతో ఉత్సాహంగా దిగంబర కవిత్వానికి ఆహ్వానం పలుకుతూ, 'చెరచబడ్డ గీతాన్ని' ఇంగ్లిష్‌లోకి తను చేసిన అనువాదాన్ని చదివి వినిపించాడు. చైనా ప్రయాణం చేసి తిరిగి వచ్చాక హైదరాబాద్ హోటల్ రూంలో కలిసినపుడు అట్లాగే ఉన్నాడు. హోటల్‌వాళ్లు ఇచ్చే టర్కీ టవల్ చుట్టుకొని.

చైనా పర్యటనలోనే మొదటిసారి ఆయనతో ఉన్న బెంగాలీ రచయితలకు ఆయన తాగుతాడని తెలిసిందట. అది అక్కడ చాల ప్రచారమైపోయింది. మనస్తాపమో, మరేమి కారణమో తెలియదుగానీ అపుడాయన తాగడం మానేసి(1978) ఉన్నాడు. కాలు గాలి న పిల్లిలా తోచకుండా హోటల్ గదిలో తిరుగుతున్నాడు. అట్లా హఠాత్తుగా మానేయొద్దని ఆ తర్వాత డాక్టర్లు చెప్పారట. శ్రీశ్రీతో పరిచయమయ్యాక ఆయన ప్రత్యేక బ్రాండు (హ్యావర్డ్)తో పరిచయం కాకుండా ఎవరూ ఉండరు. అది ఆయన పెట్టెలో ఉంటుంది. రాగానే అది చూపి అది అయిపోగానే అటువంటిది తెప్పించమని చెప్తాడు కూడ. ఉంటే డబ్బులు ఆయనే ఇస్తాడు.

'నవత' కవిత్వ పత్రిక ప్రారంభ సంచిక వెలువడినపుడు (1963), త్రీ చీర్స్ ఫర్ మాన్ (శ్రీశ్రీ కవిత్వానికి శ్రీశ్రీదే అనువాదం) వెలువడినపుడు (1964) ఆయనతో స్వయంగా నాకు ఈ వ్యసనానికి సంబంధించిన చేదు అనుభవాలు ఉన్నాయి. ఆయన హైదరాబాద్ వచ్చి కూడ ఈ కారణంగా 'నవత' ఆవిష్కరణ సభయే జరుపలేకపోయాం. కాని 1970లో విరసం ఏర్పడినాక 72లో భారత చైనా మిత్రమండలి వరంగల్ సిటీ సభలు జిల్లా సభలు (వరంగల్‌లో), కరీంనగర్‌లో జిల్లా సభలు (హుజూరాబాద్‌లో) ప్రారంభించడానికి వచ్చినప్పుడు రెండు రోజులు హనుమకొండ రెడ్డి కాలనీలో మా ఇంట్లో ఉన్నాడు.

సభలు అయిపోయేంత వరకు మందు ముట్టుకోవద్దని కఠినంగా చెప్పాను. బుద్ధిగా పాటించాడు. నా 'చలినెగళ్లు' కవితా సంకలనానికి ఆయనతో ముందుమాట రాయించుకోవాలని 1963 నుంచి ప్రయత్నాలు మొదలు పెట్టాను. హైదరాబాద్ ప్యాలెస్ టాకీసు (అబిడ్స్‌లో ఉండేది)లో 'వెలుగు నీడలు' సినిమా విడుదలయి వచ్చినప్పుడు కలిసాను. గోల్డెన్ థ్రెషోల్డ్‌లో అప్పుడు మైసూరు కేఫ్ ఉండేది. అక్కడే దిగేవాడు. 'రాత్రి' కవులంతా అక్కడే కలిసాం. అప్పుడాయనకు నా 'చలినెగళ్లు' రాతప్రతి ఇచ్చాను.

'నవత' పత్రికకు గౌరవ సంపాదకునిగా ఒప్పించడానికి ఆయనకు ఉత్తరం రాసాను. 'జననం అనగానే మరణం గుర్తుకొస్తుంది. అయినా జననం ముదావహం' అని అంగీకారం తెలుపుతూ జవాబు రాసాడు. ముందుమాట గురించి కూడా చాలసార్లు రాసాను. పిచ్చిరెడ్డి అనే మిత్రునితో కలిసి రమణస్తాన్ వెళ్లినప్పుడు మద్రాసులో ఆయన ఇంట్లో మొదటిసారి కలిసాను. 1968 దాకా ప్రయత్నించి ఇంక ఆయన ముందుమాట లేకుండానే 'చలినెగళ్లు' వెలువడింది.

సృజన '66 నవంబర్‌లో తిలక్ ప్రత్యేక సంచికగా ప్రారంభమైన దగ్గర్నించి కూడా శ్రీశ్రీ అడిగిందే తడవుగా తన రచనలు పంపేవాడు. జడ్చర్ల వంటి మారుమూల ప్రాంతాల్లో ఆయన స్వదస్తూరీలో రచనలు, ఉత్తరాలు రావడం చూసి మా సహాధ్యాపకులు నా గురించి గర్వంగా ఫీలయ్యేవారు.

ఫిబ్రవరి 1970 సృజన 14వ సంచికను శ్రీశ్రీ ప్రత్యేక సంచికగా 170 పేజీలతో తెచ్చాం. దానికోసం చాల ముందుగానే శ్రీశ్రీ హైదరాబాద్‌కు వచ్చిన ఒక సందర్భంలో బృందావన్ హోటల్లో చలసాని ప్రసాదరావుగారు ఇరవైమంది రచయితలతో దినమంతా ఒక ఇష్టాగోష్ఠి ఏర్పాటు చేసాడు. తర్వాత కాలంలో దానికి చాల ప్రచారం వచ్చింది. అప్పుడాయనతో విడివిడిగానూ, అందరం కలిసి ఎన్నో ఫొటోలు తీయించుకున్నాం. దిగంబర కవులతో ఆయన ఫొటో ఎన్నోమార్లు ఎన్నోచోట్ల ప్రచురించబడింది కూడ.

విశాఖపట్నంలో జరిగిన శ్రీశ్రీ షష్టిపూర్తిలో బహిరంగసభ వేదికపై శ్రీశ్రీ ప్రత్యేక సంచిక సృజనను ఆయన చేతికి ఇచ్చి నేను మాట్లాడాలన్నది కూడ ఒక కార్యక్రమం. కాని ఆ జనసముద్రం ముందు నిలబడడానికి భయమేసింది. వేదికమీద చూస్తే తెన్నేటి విశ్వనాథం, తాపీ ధర్మారావు, శ్రీశ్రీ మొదలైనవారు.. 'నిన్న విడిచిన పోరాటం నేడు అందుకోక తప్పదు' అనే శీర్షికతో రాసిన సంపాదకీయం భయం భయంగా చదివి సృజన కాపీ ఆయన చేతిలో పెట్టి కిందికి దిగి ఊపిరి పీల్చుకున్నాను.

మళ్లీ ఆయనను 70 జూలై 3 రాత్రి ఇంపీరియల్ హోటల్లో కలుసుకున్నాను. చలసాని ప్రసాద్ తీసుకొచ్చాడు. మర్నాడు అభ్యుదయ సాహిత్య వేదిక సదస్సుకు వెళ్లవద్దని, బహిష్కరించే కరపత్రాలు పంచి, విప్లవ రచయితల సంఘం ఆవిర్భావ ప్రకటన చేయాలని చర్చ. తాను వెళ్లి ముఖ్యమంత్రి చేతులమీదుగా ఇచ్చే రెండువేల రూపాయల చెక్ నిరాకరించి, బహిష్కరించి వస్తానని కాసేపు, ఆ వేదిక మీదనే శ్రీకాకుళ ఉద్యమాన్ని సమర్థించే సాహిత్య సంస్థను ప్రకటించి వస్తానని కాసేపు శ్రీశ్రీ ప్రతిపాదనలు- ఏర్పడబోయే సంస్థకు లావారసం అనే పేరు పెడదాం- అని మళ్లీ తానే లాక్షణిక వాద రచయితల సంఘం అని విడమర్చి చెప్పాడు.

ఏం చెప్తున్నాడు అని మేమంతా ఆశ్చర్యంగా చూస్తుంటే మన లాక్షణికవాదం మార్క్సిజమే కదా అని ముక్తాయింపు ఇచ్చాడు. ఏమైతేనేం జూలై 3 అర్ధరాత్రి అబిడ్స్ ఇంపీరియల్ హోటల్లో శ్రీశ్రీ అధ్యక్షతన విప్లవ రచయితల సంఘం ఆవిర్భవించింది. ఆ చారిత్రక పత్రంపై సంతకం చేసినవారిలో శ్రీశ్రీతోపాటు మరో పది పద్నాలుగు మందిలో నేనూ ఉన్నాను.

ఖమ్మం సుబ్బారావు పాణిగ్రాహి నగర్ వర్తక సంఘం హాల్‌లో 1970 అక్టోబర్ 5, 6 తేదీల్లో జరిగిన మహాసభలకు శ్రీశ్రీ విరసం మొదటి ప్రచురణ 'ఝంఝ' కవితా సంకలనం స్వయంగా అచ్చువేయించుకొని వచ్చాడు. ఖమ్మం రైల్వే స్టేషన్‌లో ఆయనను రిసీవ్ చేసుకోవడానికి వెళ్లిన వాళ్లలో నేనూ ఉన్నాను. రెండు చేతుల్లో రెండు పుస్తకాల కట్టలు - ఝంఝ - 'నరుడో భాస్కరుడా' పాట పాడుతూ పెట్టెలో నించి దిగుతూ ఆ కట్టలు మాకందించాడు. సభల్లో విరామం దొరికినపుడల్లా ఆ పాటే పాడుతూ ఉన్నాడు.

ఆ పాట గురించే చెప్తూ ఉన్నాడు. ఆ పాట రాసిన శివుడు - (ఆ తర్వాత కాలంలో శివసాగర్) కె.జి.సత్యమూర్తి అని, ఆయన అజ్ఞాతంలో ఉన్న నక్సలైట్ నాయకుడని చెప్పాం. ఇంక ఆనాటి నుంచి ఎమర్జెన్సీలో ఇరవై సూత్రాలను బలపరుస్తూ ఇందిరాగాంధీ లెఫ్ట్ నియంతృత్వం అన్నందుకు ఆయనను విరసం నుంచి సస్పెండ్ చేసేదాక, ఎమర్జెన్సీ ఎత్తివేసినాక విజయవాడలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయన క్షమాపణలతో సభ్యునిగా కొనసాగించి 83 జూన్ 15న మద్రాసులో శ్రీశ్రీ కన్ను మూసేదాకా మేం కలిసి పనిచేసిన సంస్థలో ఎన్ని కలయికలో.. ఎన్ని జ్ఞాపకాలో..

కవులు, రచయితలు కాని సాహిత్య పిపాసులకు అభిమాన రచయితల పట్ల ఎంత ఆరాధనా భావం ఉంటుందో ఒక అనుభవం చెప్తాను- నేను జడ్చర్ల కళాశాలలో పనిచేస్తున్నపుడు 1968లో జలజం సత్యనారాయణ పూనికతో 'మానవుడే మా సందేశం' అనే కవితా సంకలనం అచ్చేసి ఆవిష్కరణకు శ్రీశ్రీని పిలిచాం. తిరుగుటపాలో మా ఆహ్వానాన్ని మన్నించి తాను సరోజతోపాటు వస్తానని రాసాడు. జడ్చర్ల 'సాహితీమిత్రులు'లో వేణుగోపాలరావు అని డిసిటిఓ ఉండేవారు.

శ్రీశ్రీ, రావిశాస్త్రిలకు వీరాభిమాని. అప్పటికి ఆ ఇద్దరి సాహిత్యం కంఠోపాఠం. అంగీకారం వచ్చిన దగ్గర్నించి, రావడం లేదని చల్లని కబురు వచ్చేదాకా ఆయన పడిన హైరాన, చేసిన ఏర్పాట్లు, ఎదురుచూపులు ఇక్కడ ఎంత రాసినా తక్కువే. ఆ ఇద్దరికోసం ఆ దంపతులు కొన్న పట్టువస్త్రాలు, ఆయన దృష్టిలో అంతటివారు ఇంకెవరూ లేరు గనుక అట్లాగే అనాచ్ఛాదిత నిరాక్షణా వస్త్రాలుగా భద్రంగా ఉండే ఉంటాయి.

ఎంత సులభంగా వస్తానని ఒప్పుకుంటాడో, అంతే సులభంగా మానేసే ఈ స్వభావం విరసం, ఎపిసిఎల్‌సి, భారత చైనా మిత్రమండలి వంటి సంస్థల అధ్యక్షత స్వీకరించాక బాధ్యతాయుతంగా మార్చుకున్నాడు. హుజూరాబాద్, కరీంనగర్, బెల్లంపల్లి, సూర్యాపేట, వనపర్తి- ఏ మారుమూలకు పిలిచినా సభలకు వచ్చాడు. మాటలే పెగలనివాడు, అనర్గళంగా ప్రసంగాలు చేసాడు. వరంగల్, తుంగతుర్తి వంటి సభల్లో మైళ్లకొద్ది దూరం ఊరేగింపుల్లో ప్లకార్డులు పట్టుకొని, నినాదాలు ఇస్తూ నడిచాడు.

లెనిన్ శతజయంతిని పురస్కరించుకొని ఆయన వరంగల్ సుడిగాలి పర్యటన చేసాడు. తెలుగు నాటకరంగంపై లెనిన్ ప్రభావం అని ఏదో అఖిల భారత సదస్సుకు ఇంగ్లిష్‌లో రాసిన వ్యాసాన్ని వరంగల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో చదివి వినిపించాడు. కాకతీయ మెడికల్ కాలేజి మాగజైన్‌కు వాళ్లడిగితే అచ్చేసుకోవడానికి ఇచ్చాడు.

ఆ సాయంత్రం వరంగల్ ఆర్ట్స్ కాలేజి ఆడిటోరియంలో ప్రసంగించాడు. ఆయన ప్రసంగం ప్రారంభించగానే పథకం ప్రకారమే వెనుక గుంపుగా చేరిన ఎబివిపి విద్యార్థులు కుర్చీలు లాగుతూ, గోల చేస్తూ గందరగోళం సృష్టించారు. సహజంగానే శ్రీశ్రీ అభిమానుల సంఖ్య ఎక్కువ కనుక వాళ్లు తోకముడవాల్సి వచ్చింది. శ్రీశ్రీ ఎంతో ఆవేశంగా చాలసేపు ప్రసంగించడం ఆరోజే చూసాను. ఈ మూడు చోట్లకూ ఆయన వెంట నేను తిరిగాను. ఆ తర్వాత ఒక వివాదంగా మార్చి ఎబివిపి విద్యార్థులు ఆయన వ్యాసం కాగితాలు చింపి కానీ మాగజైన్ పంచడానికి వీలు లేదని కాలేజ్ ప్రిన్సిపల్ మీద ఒత్తిడి తెచ్చారు. జిల్లా యంత్రాంగం ద్వారా మౌఖిక ఆదేశాలిప్పించారు.

అప్పుడే సృజన కవర్‌పై శ్రీశ్రీ బొమ్మ, ఆయన ఇంగ్లిష్‌వ్యాసం కాపీ ఫొటో వేసి 'ఎన్ని హృదయాల నుంచి శ్రీశ్రీని చించగలరు?' అని సంపాదకీయం రాసాను. శ్రీశ్రీవైపు నిందాపూర్వకంగానో, నిషేధిస్తూనో ఎవరైనా వేలు చూపితే ఇప్పటికీ ఇదే మాట వర్తిస్తుందనుకుంటాను. ఎందుకంటే శ్రీశ్రీని దగ్గరగా చూసిన ఎవరికైనా ఆయన శిశువు వలె హృదయానికి దగ్గరవుతాడు.


- వరవరరావు
(15న శ్రీశ్రీ వర్ధంతి)

Thursday, April 29, 2010

శ్రీ శ్రీ, - మహాకవి శ్రీ శ్రీ శత జయంతి 1910 - 2010


మహాకవి శ్రీశ్రీ


శ్రీశ్రీ ఇరవయ్యవ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి శ్రీశ్రీ. శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీగా ప్రసిద్ధుడయ్యాడు. విప్లవ కవిగా, సాంప్రదాయ, ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించినవాడిగా, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, విప్లవ రచయితల సంఘం స్థాపక అధ్యక్షుడిగా, సినిమా పాటల రచయితగా ఆయన ప్రసిద్ధుడు.

శ్రీశ్రీ హేతువాది మరియు నాస్తికుడు. మహాకవిగా శ్రీశ్రీ విస్తృతామోదం పొందాడు. ఆయన సృజించిన కవితా! ఓ కవితా! అనే కవిత గురించి శ్రీశ్రీ .జీవిత కథకుడు, ప్రసిద్ధ రచయిత, భాషావేత్త, బూదరాజు రాధాకృష్ణ ఇలా రాసాడు కనీసం వేయి సంవత్సరాల చరిత్ర ఉన్న తెలుగు సాహిత్యంలో కవితను ఇలా నిర్వచించి, ఇంత కవితాత్మకంగా వర్ణించి, ఇంత అద్భుత సృష్టి చేసిన మరో కవి లేనే లేడు.

ఇదే అతణ్ణి సాహితీ శిఖరాగ్రాన నిలిపింది. మహాప్రస్థానం ఆయన రచించిన కావ్యాల్లో ప్రసిద్ధమైనది.


జీవిత గమనం

శ్రీశ్రీ - శ్రీరంగం శ్రీనివాస రావు - 1910 జనవరి 2 న పూడిపెద్ది వెంకటరమణయ్య, అప్పలకొండ దంపతులకు జన్మించాడు. ( శ్రీశ్రీ తన అనంతం పుస్తకంలో పుట్టిన రోజు గురించి వివరణ ఇచ్చారు. తను ఏప్రిల్లో పుట్టానని, తండ్రి పాఠశాలలో అవసరం నిమిత్తం 2-1-1910 అని రాయించారని పేర్కొన్నారు)

శ్రీరంగం సూర్యనారాయణకు దత్తుడగుట వలన ఈయన ఇంటిపేరు శ్రీరంగంగా మారింది. ప్రాధమిక విద్యాభ్యాసం విశాఖపట్నం లో చేసాడు. 1925 లో SSLC పాసయ్యాడు. అదే సంవత్సరం వెంకట రమణమ్మతో పెళ్ళి జరిగింది. 1931 లో మద్రాసు విశ్వ విద్యాలయం లో బియ్యే (జంతుశాస్త్రము) పూర్తి చేసాడు.


1935లో విశాఖలోని మిసెస్‌ ఎ వి ఎస్‌ కాలేజీలో డిమాన్‌స్ట్రేటర్‌గా చేరాడు. 1938లో మద్రాసు ఆంధ్రప్రభలో సబ్‌ ఎడిటరుగా చేరాడు. ఆ తరువాత ఆకాశవాణి, ఢిల్లీ లోను, మిలిటరీ లోను, నిజాము నవాబు వద్ద, ఆంధ్ర వాణి పత్రికలోను వివిధ ఉద్యోగాలు చేసాడు. 1933 నుండి 1940 వరకు ఆయన రాసిన మహాప్రస్థానం, జగన్నాథుని రథచక్రాలు, గర్జించు రష్యా వంటి గొప్ప కవితలను సంకలనం చేసి మహప్రస్థానం అనే పుస్తకంగా ప్రచురించాడు. తెలుగు సాహిత్యపు దశనూ, దిశనూ మార్చిన పుస్తకం అది.

 1947 లో మద్రాసుకు తిరిగి వచ్చి అక్కడే స్థిరపడ్డాడు. తన రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తూ మరిన్ని గొప్ప రచనలు చేసారు. ఎన్నో సినిమాలకు పాటలు, మాటలు రాసాడు. పిల్లలు లేని కారణం చేత 1949 లో ఒక బాలికను దత్తత తీసుకున్నాడు. 1956 లో సరోజను రెండవ వివాహం చేసుకున్నాడు. రెండవ భార్య ద్వారా ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు కలిగారు.
 
1955 సార్వత్రిక ఎన్నికలలో కమ్యూనిస్టుల తరఫున శ్రీశ్రీ చురుగ్గా ప్రచారం నిర్వహించాడు. హనుమాన్‌ జంక్షన్లో ఒక ప్రచార సభలో ఆయన అరోగ్యం దెబ్బతిని కొన్ని నెలల పాటు ఆసుపత్రిలో ఉండవలసి వచ్చింది. 1969 లో ప్రత్యేక తెలంగాణా ఉద్యమం తీవ్రంగా ఉన్న సమయంలో శ్రీశ్రీ వావిలాల గోపాలకృష్ణయ్యతో కలిసి ఖమ్మంలో సమైక్య వాదాన్ని వినిపిస్తూ ప్రదర్శన జరిపాడు. ఉద్యమకారులు ప్రదర్శనకు భంగం కలిగించడానికి ప్రయత్నించినా ఆగక తమ ప్రదర్శనను కొనసాగించాడు.
 

వివిధ దేశాల్లో ఎన్నోమార్లు పర్యటించారు. ఎన్నో పురస్కారాలు పొందాడు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, మొదటి రాజా లక్ష్మీ ఫౌండేషను అవార్డు వీటిలో కొన్ని. అభ్యుదయ రచయితల సంఘానికి (అరసం) అధ్యక్షుడిగా పని చేసాడు. 1970 లో ఆయన షష్ఠి పూర్తి ఉత్సవం విశాఖపట్నం లో జరిగింది. ఆ సందర్భంగానే ఆయన అధ్యక్షుడుగా విప్లవ రచయితల సంఘం (విరసం) ఏర్పడింది.
కొంతకాలం క్యాన్సరు వ్యాధి బాధకు లోనై 1983 జూన్ 15 న శ్రీశ్రీ మరణించాడు.
విశాఖపట్నం లోని బీచ్ రోడ్డులో ఆయన నిలువెత్తు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.